Minister Dayakar Rao | బీఆర్ఎస్ ప్రతినిధుల సభలను దిగ్విజయంగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్తో కలిసి వరంగల్ ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, జిల్లా చైర్మన్లు, బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ప్రత్యేకంగా ప్రతినిధుల సభను ఏర్పాటు చేసిందని.. ఎజెండా, సభ నిర్వహణ, ఏర్పాట్లపై సలహాలు, సూచనలు పాటించాలన్నారు.
పార్టీ పరంగా చేయాల్సిన తీర్మానాల విషయంలో చురుగ్గా వ్యవహరించాలని, పార్టీ నేతలు, ముఖ్యులు, సీనియర్లు కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాల లాగే, నియోజకవర్గ స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కనీసం 5వేల మంది ప్రతినిధులతో ఈ సభలు నిర్వహించాలన్నారు. అమర వీరులకు నివాళులర్పించడం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడం, ప్రతినిధులకు స్వాగతం పలకడం, అమర వీరులకు నివాళులర్పించడం, రాష్ట్రస్థాయి, దేశ స్థాయి సమస్యలతోపాటు, స్థానిక సమస్యలపై తీర్మానాలు చేయాలని సూచించారు.
ఆయా తీర్మానాలపై ఒకరు ప్రతిపాదిస్తే, మరొకరు బలపరచాలని, తీర్మానాల విషయంలోనూ సామాజిక సమతూకం పాటించాలని సూచించారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభల నిర్వహణపై మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని, ఈ మేరకు సూచించిన విధంగా నిర్వహించాలని సూచించారు. సభలో సభ్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. మధ్యాహ్నం అందించే భోజన కార్యక్రమంలో నాణ్యమైన భోజనం అందించాలని కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యేలు కలిసి భోజనాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దేవరుప్పులలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మంగళవారం జరిగే సభ ఏర్పాట్లపై ఆరా తీశారు. పనుల వేగం పెంచాలని, రేపు ఉదయంకల్లా ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలని చెప్పారు.