పాలకుర్తి : త్వరలో గిరిజనులకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సాంస్కృతిక భవనాన్ని నిర్మించి ఇస్తామని, ఇందుకు అవసరమైన ఎకరాన్ని స్థలాన్ని సేకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్ను ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బంజారాల తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యంచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.
కేసీఆర్ ఆధ్వర్యంలోనే ప్రజల అన్ని పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, హైదరాబాద్లో గిరిజన భవనం తరహాలో పాలకుర్తిలో నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఈ రోజు ఆయా గ్రామాల్లో గిరిజనులే తమ తండాలో తమ పరిపాలన చేసుకుంటున్నారని మంత్రి చెప్పారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రస్తుతం రిజర్వేషన్ల విషయం కేంద్రం ఆధీనంలో పెండింగ్లో ఉందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గవ్యాప్తంగా తరలివచ్చిన గిరిజనులు, మహిళలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.