Minister Dayakar Rao | ఉమ్మడి రాష్ట్రంలో కుంటుపడిన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టి పూర్వవైభవం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులదేనన్నారు. తొర్రూరు నుంచి వయా తిరుమలగిరి మోత్కూరుల మీదుగా ఉప్పల్ వరకు నడిచే రెండు సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో ఆర్టీసీ ఆగమైందని, ఆంధ్రాప్రాంతం నుంచి నడిచే ప్రైవేట్ బస్సుల కోసమేగాక, తెలంగాణపై వివక్షతో ఆర్టీసీకి అన్యాయం చేశారన్నారు. కార్మికులను ఇబ్బందులుకు గురి చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చారని, అన్ని విధాలుగా ఆదుకున్నారు. కార్మికులకు కావాల్సిన విధంగా సాయం అందించారన్నారు. ఇక ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత కార్మికులు, ప్రయాణికులదేనన్నారు.
తొర్రూరు బస్ డిపోను ఆధునీకరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్లాట్ ఫారాలు, ఫ్లోరింగ్ నిర్మాణాలు చేపడతామన్నారు. అయితే, బస్టాండ్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రయాణికులు ఆర్టీసి ప్రాంగణాన్ని తమ సొంత ఇంటిలా చూసుకోవాలని సూచించారు. కాగా, ఆర్టీసి సూపర్ లగ్జరీ బస్సు ప్రతి రోజూ ఉదయం 4.20 ఒకటి, 5 గంటలకు మరో సర్వీసు చొప్పున రోజుకు రెండు ట్రిప్పులు నడుస్తాయని చెప్పింది. సేవలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎం జే శ్రీలత, డిప్యూటీ ఆర్ఎం కృపాకర్ రెడ్డి, డీఎం పరిమళ తదితరులు పాల్గొన్నారు.