భూపాలపల్లి : కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఎంతో ఉపయోగమని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు కష్టపడుతున్నారని, వారిని సీఎం అభినందిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో వారికి గౌరవం దక్కిందన్నారు. గతంలో ఆశ వర్కర్ల వేతనం ఉండగా.. ప్రభుత్వం రూ.9750కి పెంచిందన్నారు. గుజరాత్లో రూ.4వేలు, మధ్యప్రదేశ్లో రూ.3వేల వేతనం ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంగన్వాడీల పరిస్థితి తెలంగాణ రాక ముందు దారుణంగా ఉండేదని, ప్రస్తుతం వారికి నెలకు రూ.13వేలు గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లిలో గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించి.. జిల్లాను పథకానికి ఎంపికచేసినందుకు మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలు డాక్టర్ పోస్టులు కావాలని అడిగితే మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు అడిగినవి కూడా పరిష్కారమవుతాయన్నారు. గతంలో భూపాలపల్లిలో ఎలాంటి వసతులు లేవని, కేసీఆర్ వచ్చాక జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. భవనాలు నిర్మించామని, ప్రస్తుతం మెడికల్ కాలేజీ సైతం మంజూరు చేసుకున్నామన్నారు.
వంద పడకల ఏరియా ఆసుపత్రి, 50 పడకల ఆయూష్ ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భూపాలపల్లి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అనేక వసతులు సమకూరుతున్నాయన్నారు. జిల్లా అభివృద్ధి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జడ్పీ చైర్పర్సన్ హర్షిణి, కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మొబైల్ క్యాంటిన్ను ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని మొబైల్ క్యాంటిన్ నిర్వాహకుడికి మంత్రి సూచించారు.