Minister Dayakar Rao | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా పేదలు, ఉపాధి కూలీలు, కార్మికుల పొట్ట కొడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. కేంద్రం ఈసారి కూడా రాష్ట్రం విజ్ఞప్తులను పట్టించుకోలేదని, బడ్జెట్లో కోతలు విధించి మరోసారి తెలంగాణపట్ల వ్యతిరేకతను బట్టబయలు చేసిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేసే కుట్రతో ప్రతి ఏటా నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు పెద్దపీట వేస్తూ.. గ్రామీణ ప్రాంత కూలీలు, కార్మికులపై వివక్ష చూపుతోందన్నారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.800కోట్లు ఇవ్వకుండా రకరకాల కొర్రీలు పెడుతోందని, తాజాగా 30వేలకోట్లు కోత విధించడం గ్రామీణ వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. పల్లెల్లో ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లకుండా ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకానికి ఏటా నిధులు తగ్గిస్తూ నీరుగారుస్తోందని మండిపడ్డారు.
ఉపాధిహామీ బడ్జెట్లో గతేడాది రూ.89వేలు కేటాయించింది, రూ.60వేలకోట్లు మాత్రమే కేటాయించి.. రూ.30వేలకోట్లు కోత విధించడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకానికి మూడేళ్లుగా బడ్జెట్లో రూ.19వేల కోట్ల కేటాయిస్తూ.. కొత్తగా రూపాయి పెంచకపోవడం గ్రామీణ భారత వ్యతిరేక ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేదలు, కార్మికులు, కూలీల పొట్టగొట్టి, రైతు వ్యతిరేఖ, గ్రామాల అభివృద్ధి నిరోధక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలంతా కలిసి రానున్న ఎన్నికల్లో సమాధి కడతారని స్పష్టం చేశారు.