Covid-19 | పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన సూచనల మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా, అన్నిరకాలు సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కేరళలో ఈ నెల 8న కొవిడ్ జేఎన్.1 వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే మాస్కులను ధరించాలని సూచించారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, కొవిడ్ టెస్టులకు కావాల్సిన కిట్స్, చికిత్స అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.