హైదరాబాద్: క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. నాన్ కమ్యునికబుల్ డిసీజ్లు అన్నింటిలోకెల్లా క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమన్నారు. క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక అంశాలుణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయని తెలిపారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లుంబిని పార్క్ నుంచి ఎంఎన్ జే క్యాన్సర్ దవాఖాన వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్ను మంత్రి దామోదర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. దేశంలో ఏటా 14 నుంచి 15 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు ఉంటున్నాయని చెప్పారు.
మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మొత్తం వుమెన్ క్యాన్సర్ బర్డెన్లో 14 శాతం ఈ కేసులే ఉంటున్నాయన్నారు. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ చేయొచ్చని వెల్లడించారు. తద్వారా కేన్సర్ను పూర్తిగా నయం అయ్యేలా చికిత్స అందించొచ్చని చెప్పారు. ప్రతి మహిళ స్క్రీనింగ్ చేయించుకోవడానికి ముందుకు రావాలని, ప్రభుత్వం ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అందిస్తోందన్నారు. ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు క్యాన్సర్ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో డాక్టర్లు, పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తీసుకొస్తామని, వీటికి ఎంఎన్జే హాస్పిటల్ హబ్గా ఉంటుందని చెప్పారు. క్యాన్సర్ చికిత్స ఒక్క రోజులోనో, ఒక్క వారంలోనో అయ్యేది కాదని, నెలలు, సంవత్సరాల తరబడి సాగుతుందని తెలిపారు. అందువల్ల పేషెంట్లకు మానసిక, శారీక, ఆర్థిక మద్దతు చాలా అవసరమని, దాని కోసమే పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.