హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డు కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ వర్గీకరణపై పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా పరిగణించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో పంజాబ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనలు ప్రారంభించారు. తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విచారణకు హాజరయ్యారు. మంద కృష్ణమాదిగ దాఖలు చేసిన పిటిషన్ను పంజాబ్ పిటిషన్కు జతచేసిన ధర్మాసనం.. వర్గీకరణకు రాష్ట్ర శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా? రిజర్వేషన్లలో అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమిటి? అని ప్రశ్నించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఎస్సీల వర్గీకరణను 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల మంజూరు కోసం ఎస్సీ, ఎస్టీలను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు లేదని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని తాజాగా రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.
ఎస్సీలకు సామాజిక న్యాయం దక్కాలంటే వర్గీకరణ జరగాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీల వర్గీకరణపై విచారణలో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగమైనందునే సుప్రీంకోర్టుకు వచ్చానని, ఈ విచారణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ థన్కాను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పారు.