హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏపీ విభజనను తమ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించిందని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏ మాత్రం అవకాశంఉన్నా.. రాష్ట్రం మళ్లీ ఉమ్మడిగా ఉండేందుకే తాము ఓటేస్తామని స్పష్టంచేశారు. గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఒకవేళ అవకాశం ఉంటే, ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే తమ పార్టీగాని, ప్రభుత్వం గాని ఉమ్మడి రాష్ర్టానికే ఓటు వేస్తుందని చెప్పారు.
ఇందుకోసం ఏ వేదిక దొరికినా మళ్లీ కలవడానికే ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్ర విభజన అసంబద్ధంగా, అన్యాయంగా జరిగిందన్నారు. అసెంబ్లీ తీర్మానాలు చేసి ఉండాల్సిందని, ఆర్టికల్ 3 ప్రకారం న్యాయంగా జరగలేదని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నదని, రెండు రాష్ర్టాలు కలిసుండాలని కోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ మళ్లీ కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్కమ్ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు రాష్ర్టాలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తమ పార్టీ రాష్ట్ర విభజనను వ్యతిరేకించిందని, ఇప్పుడు కలిసే ప్రతిపాదన వస్తే ఆహ్వానిస్తామన్నారు. కలిసి పోవాలని మొదటగా కోరేది ఆంధ్ర రాష్ట్రమేనని చెప్పారు.