హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వెనుకేసుకొచ్చారు. ఇటీవల ఆయన కుమారుడి విషయంలో సీఎం రేవంత్రెడ్డి సహకరించాడనే ఆరోపణల నేపథ్యంలో బండి మాటలు ఇప్పుడు ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు వారిద్దరి మైత్రిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఓవైపు కేంద్రంలో ఉప్పు-నిప్పులా వ్యవహరించే బీజేపీ-కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం దోస్తీ నెరుపుతున్నాయని ఆ పార్టీ నేతల వ్యవహారశైలితో అనేక సందర్భాల్లో బయటపడింది. ఇదే అంశాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పలుమార్లు ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నది. బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. మా పార్టీ నేతలు సీఎం రేవంత్ను రహస్యంగా కలుస్తున్నారని ఆయన మీడియా ఎదుట వెల్లడించారు. ఇక, తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని కాపాడేందుకు అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది.
శనివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు రూ.1,70,000 కోట్లు అని చెప్పారు. ఈ విషయాలను తాను చెప్పడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారని తెలిపారు. ఇక సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 నెలల్లో చేసిన అప్పులు రూ.3,47,294 కోట్లు అని వెల్లడించారు. వాస్తవానికి మూడు నెలల కిందట సీఎం రేవంత్ అప్పుల విషయంలో స్పష్టంగా మూడున్నర లక్షల వరకు అప్పులు చేశామని చెప్పగా, బండి సంజయ్ మాత్రం ఆ అప్పులను తగ్గించి చెప్పడం వెనుక ఉన్న మర్మమేంటీ..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక బండి ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.. ‘కుమారుడి విషయంలో సహకరించినందుకే సీఎంను వెనుకేసుకొస్తున్నారు..’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ‘సబ్జెక్టు లేకపోవడంతో ఇలాంటి స్టేట్మెంట్లు’ అంటూ మండిపడుతున్నారు. ‘2025 నాటికి కేంద్రం చేసిన అప్పులు రూ.200లక్షల కోట్ల సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.