 
                                                            Azharudddin | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారని.. తన దేశభక్తిపై తనకు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ శుక్రవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.
మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమాణం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు ఈ పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కిషన్ రెడ్డి ఏమైనా మాట్లాడతారని.. దేశభక్తిపై నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు. నా గురించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ నిర్ణయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు.
కాగా, దేశ ద్రోహానికి పాల్పడి భారత్కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అని నిన్న కిషన్ రెడ్డి విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో ఎప్పుడూ పోటీ చేసే ఎంఐఎం పార్టీ ఈసారి ఎందుకు పోటీ చేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముసుగులో మజ్లిస్ అభ్యర్థే ఎన్నికలో పోటీ చేస్తున్నాడని విమర్శించారు.
 
                            