హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అంతస్థుల వారీగా పనులన్నీ నాణ్యతతో, సమాంతరంగా జరుగాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం సచివాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి నిర్మాణ ప్రాంగణమం తా మంత్రి కలియ తిరిగారు. మంత్రుల చాంబర్లు, అధికారుల చాంబర్లు, అధికారులు, సిబ్బంది పనిచేసే ప్రాంతంలో జరుగుతున్న పనులు, ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
పనుల పురోగతి, నిర్మాణ శైలి పరిశీలన
సచివాలయ సైడ్ వాల్ గ్రిల్స్, గ్రాండ్ ఎంట్రీ, కాంపౌండ్ వాల్ రెయిలింగ్ గ్రిల్స్ (మైల్డ్ స్టీల్)కు సంబంధించి అధికారులకు మంత్రి వేముల పలు సూచనలు చేశారు. ఇటీవల తెప్పించిన మెయిన్ ఎలివేషన్ ఫినిషింగ్ ఏరియాలో ఉపయోగించే దోల్ పూర్ (రెడ్ సాండ్) స్టోన్ను పరిశీలించారు. పోర్టికో స్లాబ్ పిల్లర్లకు సంబంధించిన జీఆర్సీ క్లాడింగ్ గురించి సూచనలు చేశారు. కారిడార్ ఫాల్స్, సీలింగ్ శాంపిల్స్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఇటీవలి సందర్శన సందర్భంగా సూచించిన పనుల పురోగతి, నిర్మాణ శైలిని మంత్రి పరిశీలించారు. నిర్మాణం ఫినిషింగ్లో ఉపయోగించే ఇంటీరియర్ సామగ్రిని పరిశీలించారు. మంత్రి వెంట ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డితోపాటు పలువురు అధికారులు, వర్ ఏజెన్సీ ప్రతినిధులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ ఉన్నారు.