హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): క్యాబినెట్ ఆమోదించి, పంపించిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టులాంటిదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై క్యాబినెట్ సిఫారసును గవర్నర్ తిరసరించడాన్ని మంత్రి తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం.. క్యాబినెట్లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫారసును గవర్నర్ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమేనని ఆక్షేపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని హితవు పలికారు. గతంలో ఏ గవర్నర్ ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని స్పష్టంచేశారు. ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్కు రాజకీయ నేపథ్యం ఉండొచ్చు కానీ, గవర్నర్ కోటాలో నామినేట్ చేసే వ్యక్తికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉండొద్దా? అని మంత్రి ప్రశ్నించారు.