కేసీఆర్ను నడిపించింది పుస్తకాలే..
రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్..
ఖమ్మం నగరంలో బుక్ ఫెయిర్ ప్రారంభం
రఘునాథపాలెం, జూన్ 2: పుస్తకానికి ఉన్న విలువ ప్రపంచంలో మరే వస్తువుకూ ఉండదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ పుస్తకాల వల్లనే తెలంగాణ చరిత్ర మనగలిగిందని గుర్తుచేశారు. ఉద్యమనేత కేసీఆర్ను నడిపించింది కూడా పుస్తకాలేనన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ను మంత్రి ప్రారంభించారు.
ముందుగా స్టాళ్లను పరిశీలించి అందులోని పలు పుస్తకాలను చదివారు. ఒకప్పుడు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన పుస్తక మహోత్సవాలను.. తెలంగాణ సాహిత్య అకాడమీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ పరిచయం చేస్తూ పుస్తక ప్రియుల అభిమానాన్ని చూరగొంటున్నదన్నారు. మారుతున్న సాంకేతిక యుగంలో భవిష్యత్ తరాలకు పుస్తకం చదవడాన్ని అలవాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని తెలిపారు. ఒకప్పుడు గ్రంథాలయాల్లోని పుస్తకాలను తెచ్చుకొని పూర్తిగా చదివే వాళ్లమని గుర్తుచేశారు. కానీ నేడు డిజిటల్ పుస్తకాలు వచ్చి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివే అవకాశాలు లేకుండా చేశాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత ప్రసేన్ తదితరులు పాల్గొన్నారు.