AIMIM | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తడబడినా పాతనగరంలోని ఏడు స్థానాలను మజ్లిస్ పార్టీ తిరిగి నిలబెట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి తొమ్మిది స్థానాల నుంచి పోటీచేసిన ఆ పార్టీ.. ఏడు స్థానాల్లోనే విజయం సాధించింది.
చార్మినార్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్, నాంపల్లిలో గెలుపొందగా.. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది. ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యాకుత్పుర నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి కేవలం 810 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాంపల్లిలో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఫిరోజ్ఖాన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చివరకు 2,175 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ 81,660 ఓట్లతో తేడాతో సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు.