బడంగ్పేట, నవంబర్ 28: మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, బయటకు శత్రువులుగా చూపించుకున్నప్పటికీ, వాటిమధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదని విమర్శించారు. మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్లో సోమవారం రాత్రి ఎంఐఎం నిర్వహించిన సభలో ఒవైసీ మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ జల్పల్లి మున్సిపాలిటీకి భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. తనపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారానికి భయపడేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ప్రత్యేక ఐటీ హబ్లో మైనార్టీలకు భారీగా ఉద్యోగాఉ వస్తాయని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ర్టాల పేర్లు, హైదరాబాద్ పేరు మారుస్తుందని, అలాంటి పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించడానికి ముస్లింలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలని అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెప్పారు. గత పదేండ్లలో తెలంగాణలో ఎలాంటి అల్లర్లు జరగలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే నగరంలో అలజడులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పారు.