హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్న వేళ తెలంగాణలో ముస్లింలంతా చాలా భద్రంగా ఉన్నారని, ఇక్కడ పుట్టిన ముస్లింలుగా తాము గర్విస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గుండెమీద చేయివేసుకొని చెప్పారు. తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ హ్యాట్రిక్ సీఎంగా పదవిని అధిరోహిస్తారని, మళ్లీ తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని అసెంబ్లీ వేదికగా స్పష్టంచేశారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై ఆదివారం అసెంబ్లీలో లఘు చర్చ ప్రారంభం సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. దేశంలో అత్యధికంగా ముస్లింలు ఉన్న రాష్ర్టాల్లోనూ రూ.700 కోట్లకు మించి నిధులు కేటాయించడం లేదని, కేవలం 50 లక్షల ముస్లిం జనాభా ఉన్న తెలంగాణలో బడ్జెట్లో రూ.2,200 కోట్లకుపైగా నిధులు కేటాయిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. ఇది మైనారిటీలకు తెలంగాణ ఇచ్చిన గౌరవమని, సీఎం కేసీఆర్ను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని హితవుపలికారు.
పరిఢవిల్లుతున్న మత సామరస్యం
దేశమంతా మత ఘర్షణలతో దారుణంగా ఉన్నదని, ముస్లిం జనాభాపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయని అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. రాజస్థాన్, మణిపూర్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు రణరంగంగా మారుతున్నాయని, కానీ తెలంగాణలో తొమ్మిదేండ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని, ఇది సమర్థ పాలనకు నిదర్శనమని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బుల్డోజర్ పాలన నడుస్తుంటే.. తెలంగాణలో అన్ని వర్గాల పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పాలన నడుస్తున్నదని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు సంతోషంగా బతుకుతున్నారని కొనియాడారు. తెలంగాణ మత సార్వభౌమత్వం కలిగిన రాష్ట్రమని, భిన్నత్వంలో ఏకత్వం తెలంగాణ పాలనకు నిదర్శనమని, గంగాజమున తెహజీబ్గా తెలంగాణ కీర్తించబడుతున్నదని.. నిండు సభ సాక్షిగా గుండెమీద చేయివేసుకొని తెలంగాణ ముస్లింగా తాను గర్విస్తున్నానని భావోద్వేగంతో చెప్పారు.
కోకాపేట ఓ మచ్చుతునక మాత్రమే
బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నదని, ఇక్కడ కోకాపేటలోని ఎకరం రూ.100 కోట్లు పలకడమే రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని అక్బరుద్దీన్ చెప్పారు. అద్భుతమైన రీతిలో కాళేశ్వరం నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తున్నారని కొనియాడారు. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలవారికి ఆసరా పింఛన్లు ఇవ్వడం, దివ్యాంగుల పింఛన్ను రూ.4 వేలకు పెంచడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు లక్షల మంది యువతుల కుటుంబాలకు అండగా నిలిచాయని వెల్లడించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్, కంటివెలుగు, బస్తీ దవాఖానలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా నిలిచాయని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తొమ్మిదేండ్లల్లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,12,198 పెరిగిందని, సమర్థ పాలనకు ఇవన్నీ మచ్చుతునకలని వెల్లడించారు.
తెలంగాణలో సంతోషంగా అన్ని మతాలు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బుల్డోజర్ పాలన నడుస్తుంటే.. తెలంగాణలో అన్ని వర్గాల పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పాలన నడుస్తున్నదని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు సంతోషంగా బతుకుతున్నారని కొనియాడారు.
మైనారిటీలకు పెద్దపీట
బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా తెలంగాణలోని మైనారిటీలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు. రైల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన సైఫుద్దీన్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసి, ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి అండగా నిలిచారని, తమ వినతి మేరకు ప్రభుత్వం సత్వరం స్పందించడం సంతోషంగా ఉన్నదని సభ సాక్షిగా కృతజ్ఞతలు తెలిపారు. షాదీముబారక్ పథకం ద్వారా 2 లక్షల మంది ముస్లిం యువతులు లబ్ధి పొందారని తెలిపారు. ఓవర్సీస్ పథకం ద్వారా దాదాపు 3 వేల మంది విదేశాల్లో చదువుకుంటున్నారని, తమ వినతిని మన్నించి ముస్లిం విద్యార్థులకు సైతం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారని, తద్వారా 700 మంది తొమ్మిదేండ్లలో లబ్ధిపొందారని చెప్పారు. హజ్హౌస్ కోసం రూ.23 కోట్లు కేటాయించడం, స్థలం ఇవ్వడం, 57, 58 జీవోల ద్వారా పట్టాలు ఇచ్చి ముస్లింలను ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో శిథిలమైన మక్కా మసీద్ను కొత్తగా రూపొందిస్తున్నారని, పనులు వేగవంతం చేశారని వెల్లడించారు. క్రిస్మస్, రంజాన్కు తోఫాలు ఇస్తున్నారని, బీసీలకు ఇచ్చినట్టే, ముస్లిం మైనారిటీలకు కూడా రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమని చెప్పారు. గురుకుల, స్టాఫ్ నర్స్, పాలిటెక్నిక్ అధ్యాపకుల పోటీ పరీక్షలు ఉండటం వల్ల గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. దేవుళ్లందరి దీవెనలు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉండాలని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలువాలని ఆకాక్షించారు.