హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నత్తనడకన మిల్లింగ్, సీఎమ్మార్ ఆలస్యంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంతో మిల్లర్లు దిగొచ్చారు. ఇకపై మిల్లింగ్ వేగాన్ని పెంచడంతోపాటు సకాలంలో సీఎమ్మార్ అందించేందుకు అంగీకరించారు. ఇతర రాష్ర్టాల మిల్లులకు ధాన్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్కు విన్నవించారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో తెలంగాణ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు వచ్చే వానకాలంలో ఇతర రాష్ర్టాల మిల్లులకు ధాన్యం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనపై మిల్లర్స్ అసోయేషన్ సమావేశమై చర్చించింది.
ఒకవేళ ఇతర రాష్ర్టాల మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తే రాష్ట్రంలోని మిల్లర్లు నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఇప్పటివరకు జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని నిర్ణయించారు. మిల్లింగ్ వేగాన్ని పెంచి.. సకాలంలో సీఎమ్మార్ ఇవ్వాలని తీర్మానించినట్టు మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎఫ్సీఐ కూడా వేగంగా బియ్యం తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యాన్ని ఇతర రాష్ర్టాలకు ఇవ్వొద్దని విజ్ఞప్తిచేశారు.
ఓవైపు రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతుండటం, మరోవైపు మిల్లింగ్ నెమ్మదిగా సాగడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. అదే సమయంలో సీఎమ్మార్ ఆలస్యం అవుతుండటంతో కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. ఆలస్యమైతే సీఎమ్మార్ తీసుకొనేందుకు నిర్దందంగా తిరస్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ వానకాలం ధాన్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ర్టాల్లోని మిల్లర్లకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర మిల్లర్లు.. దిద్దుబాటు చర్యలకు దిగారు. మంత్రిని కలిసినవారిలో అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్, ప్రతినిధులు సంతోష్కుమార్, శ్రీరాములు, శివ, రాజేందర్గౌడ్, శశిధర్ తదితరులు ఉన్నారు.
తీరుమారకపోతే చర్యలు తప్పవు:మంత్రి గంగుల కమలాకర్
ఇప్పటికైనా మిల్లర్లు తీరు మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. మిల్లింగ్, సీఎమ్మార్ ఆలస్యమైతే ఇతర రాష్ర్టాల మిల్లులకు ధాన్యం ఇచ్చేందుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఇది జరగకుండా ఉండాలంటే రాష్ట్ర మిల్లర్లు మిల్లింగ్ వేగం పెంచి సకాలంలో సీఎమ్మార్ అందించాలని ఆదేశించారు.