హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టు పాల ఉత్పత్తి జరగడం లేదని, పాడి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. పాడి ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్గా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ రంగ పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పాడి ఉత్పత్తిలో మహిళలు రాణించాలని, ఇందులో భాగంగానే మధిర నియోజకవర్గంలో పాడి పరిశ్రమ నెలకొల్పేందుకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘం మహిళలకు ఇంటికి ఒక బర్రె, ఆవును ఇచ్చి ఇందిర డెయిరీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.