తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవలు బాగున్నయంటున్న కర్ణాటక, రాజస్థాన్ మహిళలు ఇది హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర సాయిరాంకాలనీ నాలా పక్కనే ఉన్న గుడిసెల బారు. ఇక్కడ మహబూబ్నగర్, కర్ణాటక, రాజస్థాన్ నుంచి వలసొచ్చిన పేదలుంటరు. పొట్ట చేతబట్టుకొని వచ్చిన వీళ్లు రోడ్డు పక్కన, చౌరాస్తాలల్ల అరేక్ మాల్ అమ్ముతా కనిపిస్తరు. 70 గుడిసెలల్ల వంద కుటుంబాల దాంక ఈడ ఉంటున్నయ్! ఈడ.. ఈ అయిదేండ్లల ఒక్క బిడ్డ గూడ పురిట్ల సావలే. పుట్టిన బిడ్డ ఉండాల్సిన బరువుకు కంటే ఒక గ్రాము ఎక్కువే! కానీ, తక్కువన్నదే లేదని లెక్కలే తేల్చినయ్! దేశంల పేదరికం ఏడుంటె రోగాలు ఆడ తలదాచుకుంటయని అందరికీ ఎర్కనే. దారిద్య్రం అండ చూసుకొని మమ్మల్నేమీ చేయలేరని రోగాలే ఎక్కిరిస్తున్న రోజులల్ల గిదెట్ల సాధ్యమని అడిగితే.. ఈ సక్సెస్ సీక్రెట్ పేరు ‘కేసీర్ కిట్’ అని ఆ తల్లులే చెప్తున్నరు.
సాయిరాంకాలనీల ఉన్న గుడిసెలల్ల ఉండె ముసలోళ్లు బిచ్చమెత్తుకుంటరు. వయసోళ్లు, పిల్లలు రోజంతా అరేక్ మాల్ (పది రూపాయల ఆటబొమ్మలు) అమ్ముతరు. ప్లాస్టిక్, తుక్కు ఏరుతరు. పిన్నీసులు, రిబ్బన్లు, బొమ్మలు అమ్ముతరు. వాళ్ల సంపాదన అంతంతే. పౌష్టికాహార లోపం, మురికి కాల్వల పక్కన ఉంటరు కాబట్టి ఈడ పుట్టే పిల్లల ఆరోగ్యానికి సమస్యలెక్కువ. గతంలో సూర్యానగర్ అంగన్వాడీ పరిధిలో ఏటా ఒకరో ఇద్దరో పుట్టిన బిడ్డలు తక్కువ (2.5 కేజీలు కంటే తక్కువ) బరువు ఉంటున్నారని తేలింది. 2017 నుంచి ఆ సమస్య పోయింది. నవజాత శిశు మరణాలు కూడా ఆగిపోయినయని అంగన్వాడీ టీచర్ కే సంధ్యారాణి చెప్పారు. తక్కువ బరువున్న శిశు జననాలు, నవజాత శిశు మరణాలు 2017 తర్వాత తమ పరిధిలో నమోదు కాలేదని ఆమె చెప్తున్నారు. అయిదేండ్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలే. ‘ఈ గుడిసెల మధ్య ఏదో అద్భుతం ఈ మార్పుని తీసుకురాలే. కాబోయే తల్లిని గుర్తించి అంగన్వాడీ కేంద్రం నుంచి దవాఖాన దాకా నడిపించే మెకానిజమే’ అని సంధ్యారాణి పేర్కొన్నారు.
వాయిదా పద్థతుంది దేనికైన
గర్భవతులు దవాఖానకు మొదటిసారి పోయినప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మూత్ర పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, బీపీ, హెచ్ఐవీ, బ్లడ్గ్రూప్, బరువు చూస్తరు. ఏదైనా తేడా ఉంటె మందుగోలీలు రాస్తరు. నెలనెల దవాఖానకు పోతే ఆరు నెలలయినంక మూడు వేల రూపాయలిస్తరు. ఆ తర్వాత నెలనెలా దవాఖానకు పోయి టెస్టులు చేయించుకుని, గవర్నమెంట్ దవాఖానల ఆడబిడ్డని కంటె అయిదువేలు, మగ బిడ్డ అయితే నాలుగువేలు ఇస్తరు. దాంతోపాటే కేసీఆర్ కిట్ ఇస్తరు. ఇందుల బిడ్డకు వెచ్చని పడకకు, సుఖ నిద్రకు, ముస్తాబుకు, ఆరోగ్యానికి కావాల్సిన మొత్తం 16 రకాల వస్తువులుంటయ్. అయినోళ్లు పెట్టినట్టే గవర్నమెంట్ తల్లికి రెండు చీరలు పెడతాంది. ఇట్ల అన్ని పరీక్షలు ఫ్రీగా జేసి, బిడ్డకు ఫ్రీగా డెలివరీ చేసుడే కాదు- బిడ్డకు వ్యాక్సిన్లు సమయానికి వేయిస్తే ఏడాదైనంక ఇంకో మూడు వేలు ఇస్తమంటరు. గవర్నమెంట్ దవాఖానల డెలివరీ అయితే ఎదురు డబ్బులే కాదు, నార్మల్ డెలివరీ అయ్యే చాన్సే ఎక్కువ. కాబట్టి భయపడకుండా వస్తున్నరు. ఈ ఏరియాల అయిదేండ్లల్ల పుట్టిన ఏ బిడ్డకూ ఆరోగ్యం బాగోలేదనే మాటే రాలే. కేసీఆర్ కిట్ వచ్చినంక వచ్చిన టాక్ గిదన్నమాట.
ఫ్రీగా చూస్తం.. పైసలిస్తం!
‘గీ వ్యవస్థలన్నీ ఇంతుకుముందూ ఉన్నయ్. ఇప్పుడే మార్పు ఎందుకచ్చింది?’ అనడిగితె.. ‘ఇప్పుడు ఆశ వర్కర్లున్నరు. వాళ్లకు ఆశ పెట్టే కేసీఆర్ కిట్ ఉన్నది’ అని ఈ ప్రాంతంల ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఉమామహేశ్వరి చెప్పారు. గర్భం దాల్చినట్టు తెలియంగనే ఆరోగ్యం ఎట్లుందో డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోవాలె. అయితే బస్తీల్ల ఉండె ఈ పేదోళ్లెవలూ డాక్టర్ దగ్గరికి పోయేటోళ్లు గాదు. కొద్దిమందే అంగన్వాడీ, ఏఎన్ఎం కేంద్రాలల్ల ఆరోగ్య సేవలు అందుకుంటున్నరు. నెలనెలా డాక్టర్ చెకప్కి రమ్మంటే.. ‘కూలికో, అరేక్ మాల్ అమ్మనీకో పోవాలె. దవాఖానకు పోయి రోజంతా ఆడ లైన్ల నిలబడితె బువ్వ ఎవలు పెడుతరని పోకపోయేది. పుట్టే బిడ్డల పానం మీదకొచ్చేది. 2017 సంది ఆ బాధలన్నీ పోయినయని ఏఎన్ఎం, అంగన్వాడి వర్కర్లంటున్నరు. ‘పనికి పోతే ఎంత సంపాదిస్తరో, దవాఖానకు వస్తే అంతకంటే ఎక్కువ డబ్బులిస్తరు. కేసీఆర్ కిట్ పేరుతోని ఇచ్చే ఆ డబ్బులు దక్కాలంటే?.. దవాఖానకు రావాల్సిందే! మందుగోలీలు మింగాల్సిందే!’అని చెబితే వస్తున్నరని వాళ్లంటున్నరు. పుట్టే బిడ్డ బాగుండాల్నని ఏ తల్లికి ఉండదు. పైసల్లేకుండా చూసుడే గాదు.. ఎదురు పైసలిస్తే అంతకు మించిన సంబురముంటదా?!’ అంటున్నరు బస్తీ జనాలు.
బిడ్డకంటే ఏదీ ముఖ్యంకాదు
నేను అరేక్ మాల్ అమ్ముత. మా అత్తగారి కుటుంబం వలస వస్తే వచ్చా. కడుపులో బిడ్డ పడగానే ఉప్పల్ పీహెచ్సీలో చూపించుకున్నా. టెస్టులన్నీ చేశారు. డెలివరీకి కర్ణాటక పోయా. కాబట్టి కేసీఆర్కిట్ రాలే. నా బిడ్డ ఆరోగ్యంగా పుట్టాడు. అంతకన్నా కావాల్సిందేముంది?
– శారద, సిద్ధాపూర్, రాయచూర్, కర్ణాటక
గరీబోళ్లకు ఆశక్కే అమ్మ!
ఆశ వర్కర్లకు గర్భిణీలను దవాఖానకు, డెలివరీకి తీస్కపోయినా, వ్యాక్సిన్లు వేయిస్తే ఇన్సెంటివ్ ఇస్తరు. ఆశక్కకు పైసలు రావాల్నంటే గర్భిణీలను బాధ్యతగా దవాఖానకు తీస్కోవాల్సిందే. దవాఖానల రోస్టర్ ప్రకారం 104 వ్యాన్ ఎప్పుడొస్తదో చూసుకుని కబురు చెబుతరు. దవాఖానకు తీస్కపోయి డాక్టర్ చెకప్, టెస్టులు చేయిస్తరు. ప్రసవం కోసం దవాఖానకు తీస్కపోతరు. ఇట్ల తల్లి తోడులేని ఈ పేద ఆడబిడ్డలను ఆశక్కే అమ్మలా చూసుకుంటది!
దగ్గరుండి చూపిస్తరు
మా వాళ్లు వనపర్తి నుంచి వలసొచ్చిన్రు. నేను ఈడనే పుట్టి, పెరిగిన. నాకు నలుగురు పిల్లలు. మొదటికాన్పు ఇంటికాడనే కన్న. కేసీఆర్ కిట్ వచ్చినంక గవర్నమెంట్ దవాఖానలో కన్న. ఇద్దరికి కేసీఆర్ కిట్ వచ్చింది. నెలనెలా వ్యాన్లో దవాఖానకు తీస్కపోయిన్రు. అట్ల పోబట్టే మా పిల్లలు మంచిగున్నరు. కేసీఆర్ కిట్ డబ్బులతోని మా ఇంటి అవసరాలు తీర్చుకున్నం.
– సిరిగిర రాధ, వనపర్తి
ప్రైవేట్ దవాఖానకు ఇకపోము
నేను గ్యాస్ స్టౌలు రిపేర్ చేస్తా. నా భార్య (శకుంతల) ఉప్పల్ చౌరస్తాలో అరేక్ మాల్ అమ్ముతుంది. మొదటి కాన్పుకు ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయిన. అప్పుడు ఫీజు 20, 30 రూపాయలే. గిప్పుడు రూ.300. అందుకని గవర్నమెంట్ దవాఖానకు తీసుకుపోయిన. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయని అప్పుడే తెలిసింది. ఏ రోగమొచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కే పోతున్నాం.
– వీరప్ప, బళ్లారి, కర్ణాటక
తెలంగాణ ధైర్యమిచ్చింది
మాకు సూదిమందంటేనే భయం. వ్యాక్సిన్లు వేస్తమని వస్తే మా కోడల్ని దాచిపెట్టాం. ఇక్కడ అందర్నీ చూసి ఇదేదో మంచిదే అనిపించింది. ఉప్పల్ పీహెచ్సీలో చూపించుకుంది. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇక్కడ గవర్నమెంట్ దవాఖానలు బాగున్నాయి. మా భయం పోయింది.
– దల్లూబాయి, పాదడి, పాలీ జిల్లా, రాజస్థాన్
వంద శాతం సక్సెస్
పేదలు, బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్మేవాళ్లుండే గుడిసెల్లో ఒకప్పుడు గర్భందాల్చితే 60 శాతం మందే రిజిస్ట్రేషన్ చేయించుకునేది. ఇప్పుడు 100 శాతం రిజిస్ట్రేషన్ అవుతున్నది. అందరూ దవాఖానల చెకప్కి వస్తున్నరు. కాబట్టే పుట్టే పిల్లలు సమస్య లేకుండా పుడుతున్నారు. కేసీఆర్ కిట్తోని గవర్నమెంట్ దవాఖానాల ప్రసవాలు పెరిగాయి.
– ఎం ఉమామహేశ్వరి, ఎంపీహెచ్ఏ, ఉప్పల్ పీహెచ్సీ