హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మధ్యతరగతి ప్రజల షాపింగ్ కేంద్రంగా నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటికే పేరొందాయి. నిజాం కాలం నుంచి అవి వీధి వ్యాపారుల కేంద్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. ముత్యాలను రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మిన చరిత్ర హైదరాబాద్కు ఉంది. ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి ముత్యాలు ఇక్కడికి దిగుమతయ్యేవి. ఇలా శాలిబండ, గోల్కొండ, ప్రతి వీధీ వ్యాపార కేంద్రంగా మారింది. కొన్ని బజార్లు అంతరించిపోయినా మరికొన్ని అలనాటి కీర్తికి గుర్తులుగా వ్యాపార కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. బేగంబజార్, సుల్తాన్బజార్, జనరల బజార్, మొజంజాహీ మార్కెట్, మదీనా, షహరాన్ మార్కెట్, జాంబాగ్ పూల మార్కెట్, చట్టాబజార్, లాడ్ బజార్, మోండా మార్కెట్లు ప్రజలతో నిత్యం సందడి తలపిస్తాయి.
చార్మినార్ సమీప లాడ్బజార్ లాక్, లక్కాలో పొదిగే సుందర స్టోన్, రాళ్ల గాజులకు ప్రసిద్ధి. మహిళలు లాడ్బజార్లో నచ్చిన గాజుల సెట్స్ తీసుకుంటారు. సుమారు వందలాది దుకాణాలున్నా.. ఈ షాపులో లక్షల వ్యాపారం సాగుతుంది. ఎంతో మంది కుటీర పరిశ్రమ కార్మికులకు ఉపాధి చూపుతున్నది. చార్మినార్ సమీపంలో సుమారు 200కు పైగా ఉన్న వెండి ఆభరణాల దుకాణాల్లో ముత్యాలు పొదిగిన ఆభరణాలు సైతం లభిస్తాయి. అందమైన డిజన్లలో ముత్యాల నగలు గుల్జార్ హౌస్ మార్కెట్లో ఆకర్షిస్తుంటాయి. పత్తర్గట్టీ పటేల్ మార్కెట్లో వస్ర్తాల దుకాణాల వరకు వేలాదిగా ఉంటాయి. సుల్తాన్ బజార్, కోఠి శతాబ్దాలుగా వ్యాపార కేద్రాలకు నిలియాలు. అన్ని రకాల వస్తువులు లభ్యమవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, పెండ్లి షాపింగ్, పాత్రలు, చెప్పులు తదితరాలన్నీ తక్కువ ధరల్లో అందుబాటులో ఉండటం విశేషం.