వెయ్యి నుంచి 3 వేలకు గౌరవ వేతనం పెంపు
సీఎంకు సంఘాల కృతజ్ఞతలు
హైదరాబాద్, మార్చి 15 : రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్తను చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్-కమ్ హెల్పర్ల గౌరవవేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. వీరికి ప్రస్తుతం గౌరవవేతనంగా రూ.1000 ఇస్తున్నారని, దానిని రూ.3,000కు పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 27 వేల పైచిలుకు పాఠశాలలుండగా, ప్రాథమిక స్కూళ్లల్లో 34,485, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 19,716 మంది చొప్పున మొత్తంగా 54, 201 మంది కుక్-కమ్ హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరికి 2010 నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున 10 నెలలకు గౌరవవేతనాన్ని ఇస్తున్నారు. తాజాగా పెంపుతో అదనంగా రూ. 2 వేలు గౌరవవేతనంగా లభించనున్నది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ రమ, తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు – జగన్నాధం ప్రవీణ్
మెప్మా, సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించినందుకు తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. టీజీవో భవన్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, టీజీవో అధ్యక్షురాలు వీ మమతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు నల్లతీగల మధు, ఎండీ ఉస్మాన్, బుచ్చమ్మ, అశోక్, వీఆర్పీ బాబు, చండికేశ్వర్, కంజర్ల రమేశ్, కృష్ణచైతన్య, ప్రసన్నకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.