హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా అన్నారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన సంజయ్ గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందు కు రావాలని పిలుపునిచ్చారు. మైక్రాన్ కంపెనీ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీగా, చిప్ తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్నది.
సీఎం రేవంత్రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎంతో చర్చించడంతోపాటు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్నదని, వ్యవసా యం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములమవుతామని చెప్పారు.
తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడంలో నాణ్యమైన సేవలను అందించడానికి విసృ్తత సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫారమ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డీ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
సీఎంతో హార్వర్డ్ వర్సిటీ బృందం భేటీ
అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకుల బృందం గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుంది. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలోని షెఫాలీ ప్రకాశ్, ఆండీ రైట్ బృందం సీఎంతో చర్చలు జరిపింది. ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. తమ బృందం రాష్ట్ర విద్యాశాఖతో కలిసి ‘ప్రోగ్రామ్ ఆఫ్ సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్’ (పీఎస్ఐఎల్-24) పేరుతో 5 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
33 జిల్లాల నుంచి పదో తరగతి, ఇంటర్ చదువుతున్న 100 మంది విద్యార్థులు, 40 మంది హైస్కూల్ టీచర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 7న ప్రారంభమైన కార్యక్రమం శుక్రవారంతో ముగుస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఏడాది పొడవునా విద్యాశిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రొఫెసర్ డీ రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన తదతరులు పాల్గొన్నారు.