హైదరాబాద్: మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్స్టేషన్ (MGBS) ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద, మట్టి మిగిలింది. బస్టాండ్లో ప్లాట్ఫారం 56, 58, 60 వద్ద భారీగా బురద పేరుకుపోయింది. మరోవైపు ఎంజీబీఎస్ మార్గంలోని శివాజీ బ్రిడ్జ్పై కూడా బురత పేరుకోయింది. సిబ్బంది బురదను తొలగిస్తున్నారు. బురదను తొలగించాక మధ్యాహ్నం నుంచి ఎంజీబీఎస్లోకి బస్సులను అనుమతించే అకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి వచ్చే బస్సులను సిబ్బంది సీబీఎస్ వద్ద నిలిపి ఉంచారు. భారీ వరదతో ఎంజీబీఎస్ను శనివారం ఉదయం అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి, వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ క్రాస్రోడ్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్ నుంచి, మహబూబ్నగర్, కర్నూలు, బెంగళూరు వైపు బస్సులను ఆరంఘర్ నుంచి నడుతుపుతున్నది.
Mgbs Musi1
పండుగ పూట ఎంజీబీఎస్ జలదిగ్బంధం
మూసీ వరద ఉధృతికి మహానగర రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్)లోకి భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా బస్సులు కదలలేక, ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొన్నది. పండుగకు ఊరెళ్లాలనుకుని కుటుంబ సమేతంగా వచ్చిన ప్రయాణికులకు ఊహించని వరద చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరద చుట్టుముట్టడంతో బస్సుల రాకపోకలను ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను నగరంలోని ఇతర ప్రాంతాల నుండి నడిపిస్తున్నట్టు ప్రకటించారు. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను తాడ్ల సాయంతో వరద నీటిని దాటుకొని బయటకు తరలించారు. 30 ఏళ్ళ అనంతరం ఇంతటి భారీ వరద వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెప్పారు.