హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రోరైల్, పురపాలక, ఎయిర్పోర్టు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణించే లక్షలాది మందికి ఈ మెట్రోరైల్ విస్తరణతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లన్నీ ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రులు గురువారం రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించి, పరిశీలించనున్నారు.