Airport Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో సిగలో మరో మణిహారం చేరబోతున్నది. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గంలో 1.7 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. ఎయిర్పోర్టు టెర్మినల్ను ఆనుకుని ఈ ప్రతిపాదిత మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ప్రీబిడ్కు కంపెనీల నుంచి మంచి స్పందన వచ్చిందని, బుధవారం బేగంపేటలోని మెట్రోరైలు భవన్లో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్కు 13 జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన సాంకేతిక బృందాలు సమావేశంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు.
ఎయిర్పోర్టు మెట్రో కోసం ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో గ్లోబల్ టెండర్లు పిలిచినట్టు తెలిపారు. సమావేశానికి హాజరైన వాటిలో ఎల్అండ్టీ, అల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పాండ్రోల్ రాహీ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక పనులైన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ పూర్తి కాగా, భూసార పరీక్షలు శరవేగంగా జరుగుతున్నట్టు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మొత్తం 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఆకాశమార్గంలో (ఎలివేటెడ్), 1.7 కిలోమీటర్ల భూగర్భంలో నిర్మించాలని నిర్ణయించినట్టు వివరించారు.
నిర్మాణం పనులు, రోలింగ్ స్టాక్ (రైళ్లు), సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థలు, పనితీరు, సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వ్యయాన్ని రూ. 6,250 కోట్లుగా అంచనా వేయగా, హెచ్ఎండీఏ, జీఎంఆర్ ఎయిర్పోర్టు 10 శాతం చొప్పున భరిస్తాయని, మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని వివరించారు. సెప్టెంబరులో పనులు ప్రారంభించి మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. సమావేశంలో సలహాదారు (సివిల్ ఇంజనీరింగ్) సుభోద్ జైన్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బీ ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ ఎంవిష్ణువర్దన్రెడ్డి, ఎస్ఈవై సాయపరెడ్డి, జనరల్ కన్సల్టెంట్(జీసీ) సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.