Summer | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సూరీడు సెగలుగక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఉదయం 9 గంటలకే మాడు పగులుతున్నది. బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొన్నది. రాబోయే మూడు రోజులూ మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్,మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. గురువారం వేడిగాలులు కొనసాగుతాయని, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ,మహబూబ్నగర్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో ఎం డల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణశాఖ చెప్పిం ది. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.