గోల్నాక (హైదరాబాద్) : చదువులో ప్రతిభ కనపరిచే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Mla Kaleru Venkatesh)అన్నారు. అలాంటి వారికి తన తల తాకట్టు పెట్టైనా అన్ని విధాలుగా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అంబర్పేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మెరిట్ విద్యార్థులను(Merit Students) శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. పది పాసైన విద్యార్థులు మరో ఐదేండ్ల పాటు ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతోందన్నారు. లేదంటే జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివించే తల్లిదండ్రులు చాలా వరకు పేద, మధ్యతరగతి వారేనని అన్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ వారు కన్న కలలను సాకారం చేయడంతో పాటు అంబర్పేట నియోజకవర్గానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
విద్యారంగానికి సీఎం కేసీఆర్(CM KCR) పెద్ద పీట వేస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దాదాపు వెయ్యి ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలు, కళాశాలలు ఏర్పాటు చేసి ఉచిత వసతితో పాటు విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందజేస్తున్నారని పేర్కొన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో విజయలక్ష్మి, అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు , విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.