అది పూర్తిగా జీవసంబంధమైన చర్యే
నిలోఫర్ ‘యువ’నోడల్ అధికారి రమేశ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): రుతుక్రమంలో ఉన్న స్త్రీలను భారత సమాజం అంటరానివారిగా చూడటం, రుతుస్రావ సమయాన్ని కళంకంగా పరిగణించడం విచారకరమని నిలోఫర్ దవాఖానలోని ‘యువ’ విభాగం నోడల్ అధికారి డాక్టర్ రమేశ్ దాంపురి ఆవేదన వ్యక్తం చేశారు. రుతుస్రావం అనేది మహిళల్లో జరి గే జీవ సంబంధమైన చర్యేనని స్పష్టం చేశారు. రుతుక్రమం-పరిశుభ్రత దినాన్ని పురస్కరించుకొని నిలోఫర్ ‘యువ’ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై చాలా మంది మహిళలకు సరైన అవగాహన లేదన్నారు. కౌమార దశలోని బాలికలు, యువతుల్లో ఈ సమస్య అధికంగా ఉండటం పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నదని చెప్పారు. సాధారణంగా మహిళల్లో ప్రతి 28 రోజులకు రుతుక్రమం వస్తుందని, ఆ సమయంలో 5 రోజులపాటు బ్లీడింగ్ అవుతుందని తెలిపారు. అందుకే ఏటా 5వ నెలలో 28వ రోజును (మే 28న) రుతుక్రమం-పరిశుభ్రత దినంగా పరిగణిస్తున్నారని వివరించారు.