హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజారక్షణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో భాగంగా మేఘాలయ ముఖ్యమంత్రి ( Meghalaya CM ) కాన్రాడ్ కె. సంగ్మా ( Conrad K. Sangma) హైదరాబాద్ బంజారాహిల్స్లోని ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (TGiCCC) ను సందర్శించారు.


ఆయనతో పాటు మేఘాలయ పరిశ్రమల శాఖ కమిషనర్ , సెక్రటరీ సిరిల్ వి. డార్లాంగ్ డియంగ్డో, ముఖ్యమంత్రి సచివాలయ జాయింట్ సెక్రటరీ శివాంష్ అవస్థి, ఉన్నతాధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు. సెంటర్లో అత్యంత ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యాలను ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా నగర భద్రతను పర్యవేక్షించే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, వీడియో వాల్, అత్యవసర సేవల సమన్వయ వ్యవస్థ , విపత్తు నిర్వహణ పనితీరును తెలుసుకుని ప్రశంసించారు.
మేఘాలయలోనూ ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేస్తాం: సీఎం కాన్రాడ్ సంగ్మా

ప్రజా భద్రత, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న సాంకేతిక విధానా లను మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా అభినందించారు. ఇక్కడి టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, భారీ వీడియో వాల్ పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు.
తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును మరింత లోతుగా అధ్యయనం చేయడా నికి త్వరలోనే మేఘాలయ నుంచి ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇక్కడికి పంపిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిన టీజీఐసీసీసీ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు.