హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా రైతు మేళాను( Mega Rythu Mela ) నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య( Janayya ) వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయంలో రైతు మేళాను విజయవంతం చేయాలని కోరారు. మహిళా రైతుల సాధికారిత లక్ష్యంగా నిర్వహించనున్న ఈ మేళకు సుమారు 8 నుంచి 10 వేల మంది మహిళా రైతులు హాజరవుతున్నారని వివరించారు.రెండు రోజుల మెగా మహిళా రైతు మేళాలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు, వాటి పరిష్కారాల పై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయన్నారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ పరిధి లోని సెర్ప్కు చెందిన సుమారు మూడు వేల మంది మహిళా రైతులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారన్నారు.వివిధ ఆధునిక సాంకేతిక అంశాలపై సుమారు 70 నుంచి 80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు వంటి అంశాలపై విశ్వవిద్యాలయం విద్యార్థిని, విద్యార్థులచే ఆటా, పాట కార్యక్రమాలుంటాయని తెలిపారు.