హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సారథ్యంలో, మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు పోలీస్శాఖ నిర్వహించిన మెగాజాబ్ మేళాలో ఎంపికైన వారందరికీ నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహా విశ్వనగరంగా రూపుదిద్దుకుందని, ప్రపంచం చూపంతా మన భాగ్యనగరం వైపే ఉందని, దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రపంచ ఐటీ హబ్గా మారిందన్నారు. ప్రపంచ మేటి పరిశ్రమలు రావడంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ 85వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, మరిన్ని అవకాశాలు నిరుద్యోగ యువతకు రానున్నాయన్నారు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ 1.35లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలే కాదు.. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి వివరించారు.
వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, దేశంలో ఐటీ రంగంలో అభివృద్ధి చెందిన బెంగుళూరుకు ధీటుగా మన హైదరాబాద్ ఎదిగిందన్నారు. అభివృద్ధి హైదరాబాద్కే పరిమితం చేయకుండా కేటీఆర్ జిల్లాలకు విస్తరిస్తుండడంతో ఐటీ, వస్త్ర, తదితర పరిశ్రమలు జిల్లాలకు వస్తున్నాయన్నారు. ఆ విధంగా ఇప్పటికే వరంగల్ జిల్లా కేంద్రానికి పలు పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
వరంగల్ లోని మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడి పెట్టి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జాబ్మేళాలో ఫార్మా, ఐటీ, బ్యాకింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, హాస్పిటల్ ఇండస్ట్రియల్, ఫైనాన్స్, నిర్మాణ రంగాలకు చెందిన 53 కంపెనీలు ఆయా రంగాల్లో ఉద్యోగాలు అవకాశాలను కల్పించాయి. జిల్లాలోని ఎనిమిది మండలాలకు చెందిన 1,517 మంది అభ్యర్థులు 541 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందారు.