హైదరాబాద్ : టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో చర్చించి మెగా డీఎస్సీ ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (MP R. Krishnaiah) కోరారు. సీఎం రేవంత్రెడ్డి మెగా డీఎస్సీ (Mega DSC) వేసి టీచర్ పోస్టులు (Teacher Posts) భర్తీ చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతించారు.
ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీచర్ పోస్టుల సంఖ్య విషయంలో కేవలం ఉద్యోగులపై ఆధారపడకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పీఆర్సీ నివేదిక ప్రకారం పదవీ విరమణ వల్ల ఏర్పడిన ఖాళీలు 24 వేలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 49 వేల ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదివేల పోస్టులు, ఐదు వేల ఆర్ట్, క్రాప్ట్, డ్రాయింగ్ పోస్టులను ఒకే సారి భర్తీ చేయాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ల ఏర్పాటు, అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, ఆయాలు, స్వీపర్ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేత గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, అంజి, అనంతయ్య, ప్రియా, దుర్గా, రాణి తదితరులు పాల్గొన్నారు.