హైదరాబాద్ : పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి (Dharani applications) మార్చి 1వ తేదీ నుంచి 9వ తేది వరకు ఎమ్మార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ధరణి దరఖాస్తుల పరిశీలన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక రెవెన్యూ సదస్సులు(Revenue Meetings) ఏర్పాటు చేశామని, ప్రజలకు న్యాయం చేయాలని ఈ సదస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకునేందుకు సదస్సులు ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని స్పష్టం చేశారు. ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.