హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 13న ప్రగతి భవన్లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కరోనా నియంత్రణ, పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నట్టు సమాచారం. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం శనివారం ముగుస్తున్నది. ఈసారి పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ, మొక్కల పెంపకాన్ని ప్రధానంగా చేపట్టారు. ఈ కార్యక్రమాలపై క్యాబినెట్ సమీక్ష నిర్వహించనున్నది. వానకాలం వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నందున పంటల సాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి విషయాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొలువుల భర్తీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై క్యాబినెట్ చర్చించనున్నది. కరోనా మూడో దశ రాకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై క్యాబినెట్ సమావేశంలో వ్యూహం సిద్ధం చేసే అవకాశమున్నది.