నల్ల సాగు చట్టాలు తెచ్చి చీవాట్లు తిన్నది..
మోటర్లకు మీటర్లు అని ఛీకొట్టించుకున్నది..
ఇప్పుడు సాగునీటిపై పన్నుకు కుట్ర చేస్తున్నది..
అన్నదాత వెన్ను విరిచేయాలని చూస్తున్నది..
ఇది కేంద్రం కుట్ర! రైతు పతనం కోరే కుతంత్రం!!
ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు సాగునీటిపై పడింది. దానిపైనా పన్నువేసేందుకు సమాయత్తమవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి నీటితీరువా వసూలుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలతో ఇటీవల ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. విద్యుత్తు మీటర్లను వ్యతిరేకించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం సాగునీటిపై పన్ను ప్రతిపాదనను కూడా నిర్దంద్వంగా తిరస్కరించింది.
Water Cess | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానావిధాలుగా రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైనా కన్నేసింది. పంటల సాగుకు అందజేసే నీటిపైనా పన్నులు విధించేందుకు సమాయత్తం అవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి పన్ను వసూలు చేయాలని కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా అన్ని రాష్ర్టాలతో ఇటీవల ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించింది. ‘భారతదేశంలోని ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టుల నీటి చార్జీలు, భౌతిక, ఆర్థిక అంశాల స్థిరీకరణకు అనుసరించాల్సిన పద్ధతులు’ పేరిట ప్రత్యేకంగా వర్షాప్ను నిర్వహించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ర్టాలు సాగునీటికి విధిస్తున్న పన్నులపై చర్చించింది. త్వరలోనే అన్ని రాష్ర్టాలకు కలిపి ఏకరీతిలో చార్జీలను విధించే విధానాన్ని తీసుకురావాలని కుట్రలకు తెరలేపింది. అయితే సమావేశానికి హాజరైన తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు మాత్రం సాగునీటిపై పన్నులను విధించడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించటం గమనార్హం.
సాగు, తాగునీరు అత్యంత ఆవశ్యకమైవి. ఆ రెండింటిపైనే సమాజ ప్రగతి, మనుగడ ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు అన్నిరంగాలను ప్రైవేట్పరం చేస్తూ, పన్నులను పెంచుతు వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా తాగు, సాగునీటిపైనా కన్నేసింది. నీటి వనరులను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు తెరలేపుతున్నది. నీటిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న సాకుతో సాగునీటితోపాటు, తాగునీటిపైన పన్నులను విధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. వివిధ రంగాల మధ్య అందుబాటులో ఉన్న నీటిని మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకే నీటి ధరలు అంటూ బుకాయిస్తున్నది. అదీగాక సాగు, తాగునీటిపై పన్నులను విధించటం ద్వారా ప్రాజెక్టుల, నీటి వనరుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఖర్చులను రాబట్టవచ్చని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. ప్రాజెక్టులు, నీటివనరుల అభివృద్ధిపై పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందాలంటే పన్నులు విధించక తప్పదని అంటున్నది. ఇందుకోసం నీటి నియంత్రణ మండళ్లు (వాటర్ రెగ్యులేషన్ బోర్డులు) ఏర్పాటు చేయాలని చూస్తున్నది.
వివిధ కారణాలను చూపుతూ సాగునీటిపై పన్నులను విధించేందుకు కేంద్రం ముమ్మర కసరత్తు చేస్తున్నది. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర.. మొత్తంగా 11 రాష్ట్రాలు ఇప్పటికే నీటిపారుదల సెస్లను విధిస్తున్నాయన్న కేంద్రం.. ఆ రాష్ర్టాలతో ప్రత్యేకంగా జూన్లో సమావేశాన్ని నిర్వహించింది. వాటినుంచి డాటాను సేకరించింది. ఆ డాటాతోనే ఇటీవల వర్క్షాప్ నిర్వహించింది. జలవనరుల శాఖ, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం, జల్ సంస్థాన్ విభాగ్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక శాఖలు, కీలకమైన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో లిఫ్ట్లు, ఫ్లో ఇరిగేషన్కు సంబంధించి అనుసరించే నీటి రేట్లు, రాష్ట్రాల్లో పంటల వారీగా వసూలు చేస్తున్న నీటిపారుదల చార్జీలు, పారిశ్రామిక, వాణిజ్య, గృహావసరాలకు, తాగు, మైనింగ్, బల్ వాటర్ చార్జీలపై చర్చించింది. అదేవిధంగా భూగర్భ జలాల వెలికితీతకు విధించే చార్జీలకు పాటించాల్సిన సూత్రాలను రూపొందించాలని సూచించింది.
సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇటీవల కొనసాగిన ఈ సమావేశానికి తెలంగాణ సాగునీటిశాఖ అధికారులు హాజరయ్యారు. సాగునీటిపై పన్నులను విధించాలనే కేంద్రం ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. సాగునీటిపై పన్నులు విధించడం సరికాదని తేల్చిచెప్పారు. సమర్థంగా నీటి యాజమాన్య పద్ధతులను అనుసరించి నీటి కొరతను అధిగమించవచ్చని, తద్వారా పంటల దిగుబడి కూడా పెరుగుతుందని సూచించారు. తెలంగాణలో టెయిల్ టు హెడ్, వారబంధి తదితర పద్ధతులు అమలవుతున్నాయని ఉదహరించారు. నీటి వినియోగం ప్రాముఖ్యంపై రైతులు, ప్రజలను చైతన్యవంతులను చేయాలని, తద్వారా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని సూచించారు. అలా కాకుండా పన్నులు వేస్తే రైతులపై భారం పడటమేగాకుండా, ఫలితం ఉండదని స్పష్టం చేశారు. సాగునీటిపై పన్నులు విధించేందుకు తెలంగాణ ఎంతమాత్రం సుముఖంగా లేదని తేల్చి చెప్పారు.