Telangana | కరీంనగర్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, పల్లె దవాఖానాల్లో పనిచేసే మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లకు మాత్రం 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. కాంగ్రెస్ సర్కారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు జీతాలు అందక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నియమితులైన వైద్యులే కాదు.. సెకండ్ ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు కూడా వేతనాలు నెలనెలా అందటం లేదు. ఏపీలో ప్రతి నెల జీతాలు సరిగ్గా ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం కేంద్ర నిధులు రాలేదని ప్రభుత్వం చెప్పటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాట పట్టేందుకు మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పీలు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే, మండల, పల్లె ప్రజలకు వైద్యసేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. రెండేండ్ల కిందట ఎన్హెచ్ఎం కింద మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పీలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను నియమించారు. వీరికి 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించాలి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీరికి నెలనెలా జీతాలు అందాయి. కానీ, కొత్త ప్రభుత్వం వచ్చాక వేతనాలు అందటం లేదు. ఈ మార్చి 20 వస్తే మొత్తం నాలుగు నెలల జీతాలు పెండింగ్లో ఉంటాయి. దీనిపై ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి లిఖితపూర్వక విజ్ఞప్తి చేసినా, వైద్యసిబ్బందికి న్యాయం జరగటం లేదు. ఎన్హెచ్ఎం కింద నియమితులైన ఆశ వర్కర్లకు ఒక నెల, సెకండ్ ఎఎన్ఎంలకు 2 నెలల వేతన బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది.
పీహెచ్సీలో మెడికల్ అఫీసర్, పల్లె దవాఖానల్లో ఎంఎల్హెచ్పీలు కీలక పాత్ర పోషిస్తారు. పీహెచ్సీలకు వచ్చే ప్రతి రోగిపై మెడికల్ ఆఫీసర్ నిఘా ఉంటుంది. అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. తోటి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ రోగికి కావాల్సిన సేవలు అందేలా చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెడికల్ ఆఫీసర్ పనితీరుపైనే సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు అధారపడి ఉంటుంది. పల్లె దవాఖానల్లోనూ ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడొద్దని మూడు నెలలుగా జీతాలు అందకపోయినా వీళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అదే జరిగితే మండల, పల్లె ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.