మహబూబ్నగర్ : ఒక్క ఫోన్ కాల్తో ఇంటికి వచ్చి కరోనా వైద్యానికి చికిత్స అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ‘ఇంటింటా ఆరోగ్యం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
‘ఇంటింటా ఆరోగ్యం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరాలు, దగ్గు ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కరోనాకు అన్ని రకాల వైద్యం అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింట ఆరోగ్యం పేరుతో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఇందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి కోరారు.
జిల్లాలో ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా 1,89,319 ఇళ్లకు వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ కార్యకర్తలు ప్రజల ఆరోగ్యం గురించి సర్వే నిర్వహిస్తారనన్నారు.
జిల్లాలో 40 వేల కోవిడ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే లక్ష కిట్లు ఇస్తామన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఎవరికైనా చికిత్స అవసరమైతే 08542- 241165 కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి చికిత్స అందించే ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కాజిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.