హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు. కొందరికి మెడికల్ బిల్లులు.. మరికొందరికి జీపీఎఫ్ బి ల్లులు… ఇంకొందరికి ఇన్సూరెన్స్ మొత్తం, జీతం అడ్వాన్స్లతోపాటు కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బిల్లులు.. ఇలా రాష్ట్ర ఆర్థిక శాఖలో కుప్పలు తెప్పలుగా విజ్ఞప్తులు పేరుకుపోతున్నాయి.
చెక్కుల క్లియరెన్స్ కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. అధికారులు రో జూ ఒకటి అర తప్ప ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తున్నది. క్లియర్ అయ్యే బిల్లులు కూడా ఎంతో పెద్ద పైరవీ చేస్తే తప్ప రావడం లేదని సమాచారం. దీంతో బాధితు లు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ బిల్లులు ఆయా శాఖ పరిధిలో మం జూరై టోకెన్లతోపాటు చెక్కులు కూడా సిద్ధం చేశారు. కానీ ఖాతాలో డబ్బులు మాత్రం జమకావడం లేదు.
బాధితుల్లో మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్కు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తే పెండింగ్ బిల్లులలో లక్ష లోపు వాటిని కూడా ఆర్థిక శాఖ విడుదల చేయడం లేదని తెలుస్తుంది. వీరిలో సామాన్యులతో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇందులో అధిక సంఖ్యలో పదవీ విరమణ చెందిన వా రు ఉండడం గమనార్హం. ఇలా పేరుకుపోతు న్న పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ప్రక్రియ మొదలు పెట్టినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బాధితుల నుంచి వినతి పత్రాలతో పాటు బిల్లుల చెల్లింపునకు టోకెన్లు కూ డా స్వీకరిస్తున్నారు.
ఈ నెలాఖరులోగా బ్యాం కు ఖాతాల్లో బిల్లులకు సంబంధించిన డబ్బు లు జమ అవుతాయని చెప్తున్నారు. నిధులు రాకను బట్టి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని, మొత్తం క్లియర్ కావాలంటే కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. బాధితులు ఓపిక పట్టాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దృష్టి పెట్టి సకాలంలో పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని బాధితులు కోరుతున్నారు.