ఖలీల్వాడి, జూన్ 6: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిరుపేదలకు ఉచితంగా అందనున్నాయన్నారు. పేదవారికి వైద్య ఖర్చులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లో రోజుకు పెద్ద సంఖ్యలో రోగనిర్ధారణ పరీక్షలు చేసే వెసులుబాటు కలిగిందన్నారు. గతంలో పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్ల్లో వేలల్లో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని.. ప్రస్తుతం పైసా ఖర్చులేకుండా టెస్టులన్నీ పూర్తవుతాయని చెప్పారు. పీహెచ్సీల్లో శాంపిళ్లు తీసుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోని డయాగ్నస్టిక్ సెంటర్కు పంపి పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇంత గొప్ప సదుపాయాలను పేద ప్రజలకు అందిస్తున్న సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠల్రావు, ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
మిత్రులతో కలిసి మంత్రి వేముల కోటి విరాళం
ఇందూర్, జూన్ 6: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని దవాఖానలు, జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాల కోసం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన మిత్రులతో కలిసి కోటి రూపాయల విరాళాన్ని ఆదివారం కలెక్టర్ నారాయణరెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు. అనూష ప్రాజెక్టు, ఎస్వీసీ కన్స్ట్రక్షన్స్, కేపీసీ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్, ఎస్ఎల్ఎంఐ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ తరఫున రూ.25 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు అందజేసినట్టు మంత్రి పేర్కొన్నారు.