వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రతి ఉపాధ్యాయుడూ నిత్య విద్యార్థిగా మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. భావితరాల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఆన్లైన్ బోర్డును సోమవారం వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మెడికల్ కాలేజీలు ఉండగా, నూతనంగా ఏడు మెడికల్, నర్సింగ్ కళాళాలలు ప్రకటించారన్నారు. వీటికి సంబంధించిన తరగతులు వచ్చే ఏడాది ప్రారంభించినట్టు తెలిపారు. నూతనంగా 600 గురుకులాలు ప్రారంభించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో బువ్వ, బాలికలకు హెల్త్కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా బాలికల పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాల నిర్వహణకు కంప్యూటర్, ఇతర పరికరాలు, త్రీడీ పాఠాల నిర్వహణకు తన సొంత ఖర్చులతో సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.