Rajeev Sagar | హైదరాబాద్ : టూరిస్టుల మాదిరి తెలంగాణకు రావడం.. అబద్దపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కాలని చూడడం తరువాత ప్రజలను విస్మరించడం కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు రూ. వెయ్యి కూడా ఇవ్వడం లేదని, అలాంటిది తెలంగాణలో రూ. 4 వేల పెన్షన్లు ఏవిధంగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఉచిత బియ్యం అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు ఉచిత బియ్యం ఇవ్వడం కుదరదని చేతులెత్తెసిందని గుర్తు చేశారు.
2019 ఎన్నికల్లో రూ. 6 వేల పెన్షన్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారని అదే ఇప్పుడు రూ. 4 వేలు ఇస్తానంటే తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అడ్డగోలుగా హామీలు ఇవ్వడం, తరువాత వాటిని విస్మరించడం దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుసరిస్తున్న సూత్రమని రాజీవ్ సాగర్ మండిపడ్డారు.
ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని అలాంటి పార్టీ అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించనట్లే ఉందని ఆయన ఎద్దెవా చేశారు. అసలు లక్ష కోట్లే ఖర్చు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన అభివృద్దిని చూసి ఓర్వలేక విమర్శలు చేయడానికే ఖమ్మం సభ ఉందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ టీం కాదని.. కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజల తరపున ప్రశ్నించే ఢీ టీం అని తెలిపారు.