Meday Rajeev Sagar | బీజేపీ నేతలు అప్పుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన రూ.100లక్షల కోట్ల అప్పులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఒక వేలితో ఇతరులను నిందిస్తే నాలుగు వేళ్లు మనల్నే ప్రశ్నిస్తాయనే విషయం మర్చిపోవద్దన్నారు.
బీఆర్ఎస్కు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న ఆదరణను చూడలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని భయపడి బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రూపాయి నిధులు తీసుకురావడం తెలియని కిషన్రెడ్డికి నిందలు వేయడం మాత్రమే బాగా వస్తాయని మండిపడ్డారు.
రాష్ట్ర సర్కారు తీసుకువచ్చిన అప్పుతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందిస్తుందని, మరీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పుతో ఏం సాధించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు రూ.7వేలకోట్ల భూములు అమ్మిందని గగ్గోలు పెట్టే బీజేపీ నేతలకు రూ.లక్ష కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమ్మితే కనిపించడం లేదా? అని నిలదీశారు.
దేశంలో గతంలో 14 మంది ప్రధాన మంత్రులు 67ఏళ్లలో రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో మోదీ ఒక్కడే రూ.100లక్షల కోట్ల అప్పు చేశాడని గుర్తు చేశాడు. బీజేపీ నేతలకు దమ్ముంటే మోదీని అప్పుపై ప్రశ్నించాలని సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణతో ముందుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తే గల్లి నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని విమర్శించారు.