హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్న మేడారం జాతరలో పాల్గొనే భక్తులకు ఎటువంటి లోటు రాకుండా అసాధారణ ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించనున్న జాతరకు మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నాలుగు నెలల (గత నెల చివరి వారంలో) ముందే రూ.75 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇది నాలుగో జాతర. ఈ నాలుగు జాతరలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.332.71 కోట్లు కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు శాశ్వత ప్రాతిపదికన మరికొన్ని చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ భావిస్తున్నది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయటంతోపాటు, జాతర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పేవిధంగా కార్యాచరణ రూపొందించనున్నది. ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ములుగు జిల్లాలో పర్యటించి జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు విస్తృత అవగాహన కల్పించడం, ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.