హైదరాబాద్ : మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి మేడారంలో గద్దెలపై కొలువుదీరింది. గిరిజన సంప్రదాయం, అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. వనంవీడి జనం మధ్యకు వస్తున్న సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గౌరవసూచకంగా ములుగు ఎస్పీ పది రౌండ్ల పాటు గాలిలోకి కాల్పులు జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం డప్పు వాయిద్యాల, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తోడుకొని వచ్చారు. భక్తులు జయజయధ్వానాలు, పొర్లుదండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలికారు. అమ్మవారు గద్దెలపైకి కొలువుదీరిన సందర్భంగా ఆనవాయితీ ప్రకారం కొద్దిసేపు మేడారంలో విద్యుత్ దీపాలు నిలిపివేశారు.
పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిపోతున్నది. మేడారం గద్దెపై కొలువుదీరగా.. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించడానికి గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోనున్నది. ఇప్పటి నిన్న గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరగా.. భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సమ్మక్క-సారలమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం దర్శించుకోనున్నారు.