ములుగు, ఫిబ్రవరి 19 తాడ్వాయి: మేడారం మహాజాతర ముగిసింది. వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు భక్తుల మొకులు అందుకొన్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) వన దేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటలకు గోవిందరాజులు, సాయంత్రం 6:15 గంటలకు సమ్మకను, సాయంత్రం 6:30 గంటలకు పగిడిద్దరాజును తరలించారు. గద్దెపై ఉన్న సారలమ్మను కన్నెపల్లికి తీసుకెళ్లారు. గద్దెపై ప్రతిష్ఠించిన మెంటె (వెదురుబుట్ట)ను సాయంత్రం 6:40 గంటలకు జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. వచ్చే బుధవారం మేడారం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహాజాతర అంకం పరిసమాప్తమవుతుంది.
జాతరకు 8 లక్షల మందిని తరలించిన ఆర్టీసీ
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతరకు ఆర్టీసీ ముందస్తు ప్రణాళికలు సత్ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి 8 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివెళ్లారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ జాతరకు రెండు నెలల ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతరకు ఈ నెల 11 నుంచి శనివారం వరకు 3,845 స్పెషల్ బస్సులు నడిపారు. ఆర్టీసీ బస్సుల్లో అయితే గద్దెలకు సమీపానికి చేరుకోవచ్చంటూ చేసిన ప్రచారం కలిసొచ్చింది. బుధ, గురు, శుక్రవారాల్లో రోజుకు రెండు లక్షల మందికిపైగా బస్సుల్లో వచ్చినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. మొత్తం 12,500 మంది సిబ్బంది విధులు నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ వినూత్నంగా తీసుకొచ్చిన ‘మేడారం విత్ టీఎస్ఆర్టీసీ’ యాప్సైతం ప్రయాణికులు ఎంతో ఉపయోగపడింది.