హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రూ.882.18 కోట్లతో నిర్మించనున్న మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. మెదక్ జిల్లాలో 33.676 కిలోమీటర్లు, సిద్దిపేటలో 36.302 కిలోమీటర్ల చొప్పున మొత్తం 69.97 కిలోమీటర్ల నిడివితో జాతీయ రహదారిని నిర్మించనున్నట్టు వివరించారు. సోమవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో మెదక్-సిద్దిపేట నేషనల్ హైవే పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట నుంచి రంగధామ్పల్లి వంతెన వరకు రీచ్-1, మెదక్ పట్టణం నుంచి నిజాంపేట వరకు రీచ్-2గా పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పలు గ్రామాల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. జాతీయ రహదారి కోసం మెదక్ జిల్లాలో 26.82 హెక్టార్లు, సిద్దిపేటలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేపట్టాలని, మెదక్ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉన్నదని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో హరీశ్రావు మెదక్, సిద్దిపేట కలెక్టర్లకు ఫోన్ చేసి, భూసేకరణను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అటవీ భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆర్అండ్బీ జాతీయ రహదారుల విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డితోపాటు ఆర్అడ్బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.