మెదక్ మున్సిపాలిటీ, మార్చి 24 :మెదక్ చర్చిలో(Medak Church) ఆదివారం మట్టల పండుగ(Mattala festival) చర్చి కమిటీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలి రావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం 8.30 గంటలకు యేసు శిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలను అలపిస్తూ చర్చి చుట్టూ ఊరేగించారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
యేసు ప్రభువు జేరుసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినపుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో(చెట్ల కోమ్మలతో) ఘన స్వాగతం పలుకుతారు.
దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారు. ఈ మట్టెల పండగను గుడ్ ప్రైడేకు ముందు వచ్చే ఆదివారం చేసుకుంటారు. ఈ వారాన్ని పరిశుద్ధ వారంగా పరిగణిస్తారు.
ఈ సందర్బంగా సీఎస్ఐ మినిష్టిరియల్ బోర్డు కన్వీనర్ రెవరెండ్ విల్షన్ భక్తుల నుద్దేశించి దైవ సందేశం చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో చర్చి పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, సువర్ణ, జైపాల్, సీఎస్ఐ కమిటీ సభ్యులు గంట సంపత్, జాన్సన్, సంసన్ సందీప్, గెలెన్, నోబుల్సన్, సువన్ డగ్లస్ల, తదితరులు పాల్గొన్నారు.