హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) త్వరలో సుదూర ప్రాంతాలకు మరిన్ని ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను నడపబోతున్నది. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. మిగతా రూట్లలోనూ ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ నుంచే వాడకంలోకి తేవాలని భావిస్తున్నది.
పల్వాల్ (హర్యానా)లోని జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బుధవారం స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఈ బస్సులతోపాటు త్వరలో టీఎస్ఆర్టీసీకి అందనున్న రెండు ప్రొటోటైప్ (నమూనా) బస్సులను కూడా పరిశీలించారు. అనంతరం జేబీఎం గ్రూప్ సేల్స్ హెడ్ (నార్త్) ముఖేశ్ శర్మ, ఆపరేషన్స్ జీఎం ప్రశాంత్శర్మతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ బస్సుల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి టీఎస్ఆర్టీసీకి అందించాలని కోరారు. టీఎస్ఆర్టీసీకి విడతలవారీగా మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు జేబీఎం గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నదని, వాటిలో కొన్ని బస్సులు డిసెంబర్లో అందుబాటులోకి రానున్నాయని సజ్జనార్ తెలిపారు.
అత్యాధునిక హంగులతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలతోపాటు అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ (ఎఫ్డీఎస్) వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. వీటితోపాటు గమ్యస్థానాల వివరాలను తెలిపేందుకు ఎల్ఈడీ బోర్డులు, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, సికింద్రాబాద్ డిప్యూటీ ఆర్ఎం భీమ్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ భానుప్రసాద్, జేబీఎం గ్రూప్ ప్రతినిధులు నిఖిల్ ఓఝా, అమిత్ వర్మ, మనోహర్లాల్ తదితరులు పాల్గొన్నారు.