Mulugu | హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఎంబీఏ విద్యార్థిని సుంకర సాహితి ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని గురువారం సాయంత్రం పలువురు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన వెంకట సుబ్బారావు కుమార్తె సుంకర సాహితి (26) ఎంబీఏ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని కొంతకాలం కిందట హైదరాబాద్కు వచ్చింది. దిల్సుఖ్నగర్లోని లక్ష్మీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుక్కుంటుంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సాహితి.. హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సాహితిని వెంకటాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నేత చిడెం మోహన్రావు కుమారుడు హరీశ్ కొద్దిరోజలుగా వేధిస్తున్నాడని.. బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తండ్రి ప్రస్తుతం పీఏసీఎస్ అధ్యక్షుడు కావడంతో.. అతని అండ చూసుకుని సాహితిని మానసికంగా వేధింపులకు గురి చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని మోహన్రావు దృష్టికి తీసుకెళ్తే.. కొడుకును మందలించాల్సిందిపోయి.. రివర్స్లో సాహితికి ఫోన్ చేసి బెదిరించాడని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మానసిక క్షోభకు గురైన సాహితి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. కాగా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని వెంకటపురం మండల కేంద్రంలో గురువారం నాడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.